తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్ఈఐ-ఆర్బీ) ప్రకటనలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి దాదాపు 5,300 పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు తొలుత భావించింది. అయితే వీటిలో తొలివిడతలో టీజీటీ, పీజీటీ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోంది. డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ తదితర పోస్టులకు తర్వాత ప్రత్యేక ప్రకటనలు జారీ చేయనుంది. ఇటీవల గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీకి అప్పగించిన ప్రభుత్వం…. నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఈ దఫా ఆయా సొసైటీల ఉమ్మడి నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనుంది.
1) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
మొత్తం ఖాళీలు: 1972
సొసైటీలవారీ ఖాళీలు: బీసీ-472, ఎస్టీ-49, సాధారణ గురుకుల సొసైటీ-16, ఎస్సీ-155, మైనార్టీ-1280.
ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు వస్తే చాలు.
2) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
మొత్తం ఖాళీలు: 960
సొసైటీలవారీ ఖాళీలు: సాధారణ గురుకుల సొసైటీ-27, ఎస్సీ-597, ఎస్టీ-100, మైనార్టీ-236.
ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు వస్తే చాలు. టీఎస్టెట్/ ఏపీటెట్/ సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: పీజీటీ అభ్యర్థులను రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులను రాతపరీక్ష (80శాతం), టెట్ స్కోరు (20శాతం) ద్వారా ఉద్యోగంలోకి తీసుకుంటారు.
పరీక్షా విధానం: ఓఎంఆర్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. బాల్ పాయింట్ పెన్నుతో సమాధానాలు గుర్తించాలి. మొత్తం మూడు పేపర్లలో పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపరులో ప్రశ్నకు ఒక మార్కు వంతున 100 ప్రశ్నలు అడుగుతారు. మూడు పేపర్లకు కలిపి మొత్తం 300 మార్కులు. ఒక్కో పేపరుకు 2 గంటల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నియామక బోర్డు రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు.
పరీక్షా మాధ్యమం: లాంగ్వేజీ సబ్జెక్టులు మినహా మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.07.2018
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.08.2018