పెరిగిన ధరలతో వింత దొంగతనాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బంగారం, వజ్రాలు, ఫోన్లు వంటి విలువైన వస్తువులు చోరీ చేయడం చూసుంటాం. కానీ రాత్రివేళల్లో రోడ్లపై వింత దొంగతనాలు జరుగుతున్నాయి.వరుసగా లారీలు పార్క్ చేసి ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో అలికిడి కావడంతో లారీ డ్రైవర్ లేచి చూశాడు. ముందు లారీ పక్కన జరుగుతున్న తతంగం చూసి షాక్‌కి గురయ్యాడు. వెంటనే కేకలు పెట్టడంతో దుండగులు అప్రమత్తమయ్యారు. తాము వేసుకొచ్చిన కారును అక్కడే వదిలేసి పత్తాలేకుండా పారిపోయారు. దేశంలో అంతకంతకూ ధరలు పెరగడం కూడా కొత్త దొంగలను పుట్టిస్తుందనేందుకు నిదర్శనంగా నిలిచే ఈ షాకింగ్ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని బొర్రొలగూడెం స్టేజీ వద్ద సుమారు 15 లారీలు వరుసగా నిలిపి డ్రైవర్లు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో అలికిడి కావడంతో లారీ డ్రైవర్ లేచి చూసి షాక్‌కి గురయ్యాడు. తమ ముందు నిలిపి ఉంచిన లారీ పక్కన కొందరు దుండగులు కనిపించారు. లారీ ట్యాంకులోని డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు గుర్తించిన డ్రైవర్ వెంటనే పెద్దగా కేకలు వేయడంతో దుండగులు అప్రమత్తమయ్యారు.

దొంగలను పట్టుకునేందుకు లారీ డ్రైవర్లు ప్రయత్నించడంతో దొరికిపోతామనే భయంతో దొంగలు తమ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కారులో పరిశీలించగా సుమారు 5 లారీల నుంచి చోరీ చేసిన 300 లీటర్ల డీజిల్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారు, దొంగిలించిన డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంతో దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.

error: