పెళ్లి ఆశ చూపించి వృద్ధుడిని మోసం చేసిన మహిళా

ఓ మహిళ వృద్ధుడిని పెళ్లి చేసుకుంటానంది. వృద్ధాప్యంలో అతడికి తోడుగా ఉంటానని ఒట్టేసింది. ఆమె మాటలు నమ్మిన వృద్ధుడిని నట్టెటా ముంచి రూ.కోటితో ఊడాయించింది. మోసపోయిన బాధితుడు ముంబయిలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలద్‌ ప్రాంతంలో నివసించే 73 ఏళ్ల జెరాన్‌ డిసౌజా 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. కాగా 2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దానిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నాడు. అయితే, అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న షాలినీ ఈ విషయం గమనించింది.

జెరాన్‌ ఉపసంహరించుకున్న డబ్బును కొట్టేయాలన్న ఉద్దేశంతో అతడితో పరిచయం పెంచుకుంది. వివాహం చేసుకుంటానని మాటిచ్చింది. దీంతో ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగారు. ఆ తర్వాత తనొక వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టుబడి పెట్టాలని జెరాన్‌ను కోరింది. లాభాలు చెరి సగం తీసుకుందామని నమ్మబలికింది. కాబోయే భార్యే కదా అని పెట్టుబడి కింద రూ.1.3కోట్ల డబ్బును 2020 డిసెంబర్‌లో షాలినీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

అంతే, నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. జెరాన్‌ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. దీంతో మోసపోయాయని తెలుసుకున్న బాధితుడు గత డిసెంబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు పరిశీలించిన పోలీసులు మోసం జరిగినట్లు నిర్ధారించి తాజాగా కేసు నమోదు చేశారు.

error: