అంతా ఊహించినట్లుగానే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. అయినా, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని.. సైనికుల వలే పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని చాటారన్నారు. నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేశారు. నేడు దేశాన్ని మహమ్మారిని నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేడ్కర్ గొప్ప నివాళి అని వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాధాసీదాగా జరపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రధాని ప్రసంగంలోని కీలక అంశాలు…
దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారి ఉండేవి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్వైపు చూస్తున్నాయి.
ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి.. తీవ్రతను కనిష్ఠానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం.
Tags ambedkar bjp carona virus INDIA lockdown modi telangna