వ్యాపారంగా మారిన అద్దెగర్భం..

అద్దెగర్భాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చారు. అనారోగ్యం కారణంగా పిల్లలు పుట్టని దంపతులు కోసం సరోగసీ విధానాన్ని వైద్యులు ప్రవేశ పెట్టారు. ఇప్పుడు దానిని కూడా వ్యాపారంగా మార్చారు కొందరు నీచులు. ఈ విధానానికి ముఖ్యంగా పేద మహిళలను టార్గెట్ చేసి వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. బూర్గంపాడు మండలంలో డబ్బు ఆశకుపోయి కట్టుకున్న భర్తే తన భార్యను సరోగసికి పురికొల్పాడు. అందుకు ఆమె అంగీకరించకుండా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బూర్గంపాడు మండల పరిధిలోని నకిరిపేట గ్రామానికి చెందిన భూక్యా రాణికి టేకులపల్లి మండలం ముత్యాలంపాడు శాంతినగర్‌కు చెందిన భూక్యా రమేష్‌తో 2013లో వివాహం జరిగింది. రూ.5 లక్షలతో పాటు కట్నం, ఎకరం భూమి కట్నకానుకుల కింద ఇచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న రమేష్‌‌ వ్యసనాలకు అలవాటుపడ్డాడు. తన జల్సాలకు డబ్బులు లేకపోవడంతో భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో జూన్‌ నెలలో హైదారాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేసుకుని బతుకుదాం అని చెప్పి కుమారులను భార్య పుట్టింట్లో వదిలిపెట్టి రాణితో కలిసి వెళ్లాడు.

అక్కడ పనిలేకపోగా.. డబ్బుకోసం సరోగసికి ఒప్పుకోవాలని భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. నాలుగు లక్షలు వస్తాయని చెప్పాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. తాను మరో కాన్పుకు సిద్దంగా లేనని బాధితురాలు చెప్పడంతో పిల్లలతో పాటు తన అన్నను సైతం చంపేస్తానని భర్త బెదిరించాడు. మత్తుమందు ఇచ్చి శ్రీలతను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు సరోగసి చేయించాడు. అనంతరం తనకు ఆపరేషన్ చేయించారని తెలుసుకున్న శ్రీలత భర్తను ఎదిరించింది.

వెంటనే ఆమెకు అబార్షన్ చేశారు. ఈ సరోగసితో మొత్తం ఆమెకు నాలుగుసార్లు ఆపరేషన్ అయినట్లైంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. రాజు ఎంచక్కా నాలుగు లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నెల రోజుల క్రితం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి భువనగిరిలోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రికి తరలించారని, దీంతో నెల రోజుల పాటు కోమాలో ఉన్నట్లు తన ఫిర్యాదులో తెలిపింది. తరువాత తన శరీరంలో జరుగుతున్న మార్పులు గమనించి ఆ విషయంపై వైద్యులను నీలదీయగా విషయం బయట వ్యక్తులకు తెలుస్తుందని అబార్షన్‌ చేయించారని, ఇందులో ఆసుపత్రి యాజమాన్యం పాత్ర ఉందని పేర్కొంది. రూ4.5 లక్షలతో సరోగసి ద్వారా కాన్పుకు అగ్రిమెంట్‌ రాయించుకున్నాడని, కొత్తగూడెం పట్టణానికి చెందిన మధ్యవర్తి ద్వారా రూ2లక్షలు తీసుకుని తెలియకుండానే సంతకం చేసినట్లు చెప్పింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ముఠా గుట్టు రట్టుచేశారు. ఇందులో భాగంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అద్దె గర్భానికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల దాకా ఇస్తున్నారని తెలుస్తోంది. భాదితురాలి భర్త రమేష్‌, మధ్యవర్తి కొండబాబు, అత్త, ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: