శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం – తలసాని

హైదరాబాద్‌: అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్‌లో ప్రదర్శించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 57 వేల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని చూశారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో తెలంగాణ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రతినిధులను సీఎస్‌ సోమేష్‌ కుమార్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు వారాలపాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను నేటితరానికి పరిచయం చేశామన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమాను ప్రదర్శించామని.. దీనికి తెలంగాణ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రతినిధులు పూర్తిగా సహకరించారని వెల్లడించారు. ప్రభుత్వం సినీ పరిశ్రమను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నదని చెప్పారు.

శాంతిభద్రతలను పరిరక్షించడానికి రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదన్నారు. మంత్రిగా కాకుండా ఒక పౌరుడిగా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

error: