కశ్యప్ తో సైనా నెహ్వాల్ వివాహం

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లాడబోతున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్ 16న వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. వీరి పెళ్లికి 100 మంది అత్యంత సన్నిహితులు హాజరు కాబోతున్నట్టు సమాచారం. డిసెంబర్ 21న రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది.వీరిద్దరూ 2005 నుంచి పుల్లెల గోపీచంద్ దగ్గర బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నారు. స్టార్ షట్లర్‌గా ఎదిగిన నెహ్వాల్.. 20 మేజర్ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ స్వర్ణం సాధించాడు. ఒకానొక దశలో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అతడు ఆరోస్థానానికి చేరుకున్నాడు.
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ సమయంలో కశ్యప్ తనకు ఎంతో అండగా నిలిచాడని సైనా చెప్పుకొచ్చింది. అతడితో కలిసి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం అప్పటి నుంచే ప్రారంభించింది. విమల్ కుమార్ దగ్గర ట్రైనింగ్ కోసం 2014లో సైనా బెంగళూరు వెళ్లింది. ఆ సమయంలో కశ్యప్ తరచుగా ఆమె కోసం బెంగళూరు వెళ్తుండేవాడు.
సైనా, కశ్యప్‌లు గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఎక్కడా బయటపడలేదు. వీరిద్దరి ప్రేమ విషయం అత్యంత సన్నిహితులకు మాత్రమే. దీపికా పల్లికల్-దినేశ్ కార్తీక్, ఇశాంత్ శర్మ-ప్రతిమా సింగ్, గీతా ఫోగట్-పవన్ కుమార్, సాక్షి మాలిక్-సత్యవ్రత్‌లు క్రీడల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సైనా-కశ్యప్ జోడి కూడా వీరి సరసన చేరనుంది.

error: