రూ.1200 కోట్ల మార్కెటింగ్ స్కాం

ఇద్దరే ఇద్దరు.. 1200 కోట్ల లూటీ. కరక్కాయ స్కామ్ మరువక ముందే బయటపడ్డ మరో భారీ స్కామ్. ఒకటి కాదు రెండు కాదు గొలుసుకట్టుగా ఏకంగా 1200 కోట్లు కొళ్ళగొట్టారు. ప్రధాన నిందితులు ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు హర్యాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాలలో కూడా సాగిన ఈ గొలుసుకట్టు దందాలో బాధితులంతా.. నిరుద్యోగ యువత, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులే. హై లెవల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో పక్కా స్కెచ్ వేసి 1200 కోట్లు దోచేశారు. ఐతే, కూకట్ పల్లిలోని ఓ బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా… ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్స్ ఆఫెన్సెస్ వింగ్ కేసును దర్యాప్తు చేసింది.

రాధేశ్యామ్, సురేందర్ సింగ్. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఎండీ, సీఈవో లు. అత్తెసరు చదువే అయినా సూటు బూటు వేసుకుని జనాన్ని మోసం చేయడంలో మాత్రం వీళ్లు దిట్టలు. హర్యాణకు చెందిన ఈ ఇద్దరు ఢిల్లీ కేంద్రంగా  మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. అన్ని నిబంధనలను పాటిస్తామంటూ మార్కెటింగ్ కోసం అనుమతులు పొందారు. ఆన్ లైన్ అడ్డాగా మల్టీ లెవల్ మార్కెటింగ్ కి తెరతీశారు.  ఇందులో తమ వద్ద ఉన్న ప్రొడక్ట్స్ మార్కెటింగ్ స్కీమ్ లో చేరితే కేవలం 7500 పెట్టుబడితో రెండేళ్ళలో 60,000 లాభం, కమీషన్లు ఇస్తామని నమ్మించారు.తాము ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో పత్రికల్లోని క్లాసిఫైడ్స్ లో యాడ్స్ ఇచ్చారు. తమ హెల్త్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ లో పెట్టే రూ.7500  పెట్టుబడిలో 2500 మెంబర్ షిప్ కోసం, మిగిలిన 5000 రూపాయలకు మెడిసిన్స్, బట్టలు డెలివరీ చేసేవాళ్ళు. దీంతోపాటు చైన్ సిస్టమ్ లో ఎంతమంది మెంబర్స్ ను చేర్పిస్తే వాళ్ళ టార్గెట్లను బట్టి పది లెవెల్స్ లో కమీషన్లు 5000ల నుండి కోటి రూపాయల వరకు ఫిక్స్ చేశారు. దేశ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా మెంబర్స్ ని తన మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉచ్చులోకి లాగారు.

error: