హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్-09న పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో పలువురు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు షర్మిలను కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు షర్మిలతో భేటీ కాగా.. తాజాగా టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల కలిశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని లోటస్పాండ్కు తన భర్త నరసింహా రెడ్డితో కలిసి వెళ్లిన శ్యామల.. షర్మిలతో భేటీ అయ్యారు. సుమారు పదిహేను నిమిషాల పాటు పలు విషయాలపై చర్చించారు. పార్టీ పెడితే తాము కూడా కండువా కప్పుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజు కావడంతో విషెస్ చెప్పడానికి శ్యామల దంపతులు లోటస్పాండ్కు వెళ్లి కలిశారు. తాజాగా షర్మిలతో వీరు భేటీ అయ్యారు. ప్రస్తుతం శ్యామల యాంకర్గా, సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. నరసింహా పలు సీరియల్స్లో నటిస్తున్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త ఇద్దరూ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. తాజాగా షర్మిలతో భేటీ కావడంతో త్వరలోనే వీరిద్దరూ కొత్త పార్టీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పలు జిల్లాల అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో ఇప్పటికే భేటీ అయ్యి వారి అభిప్రాయాలను షర్మిల అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ కూడా పాలమూరు జిల్లా వైఎస్ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు.
Tags anchor shyamala famous anchor hyderabad lotus pond new party new political party special guest telangana ys jagan ys sharmila