చంద్రబాబుకు సిగ్గులేదా-అంబటి రాంబాబు

రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికడతామని సీఎం జగన్ చెప్పారని… ఆ ప్రక్రియ విజయవంతమైందని అంబటి వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో రూ. 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారని కొనియాడారు. పీపీఏ ద్వారా ఏడాదికి రూ. 2500 కోట్లు నష్టం ప్రభుత్వానికి వస్తుందని… పీపీఎల్లో వందల కోట్లు కమీషన్ పేర్లతో నొక్కేసారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీకి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధమని అంబటి ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు ఎందుకు ఉన్నారని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని… అనుమతి లేని ఇంట్లో ఎందుకు ఉంటున్నారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు అక్రమ ఇంట్లో ఉంటున్నా సిగ్గు అనిపించడం లేదా ? అని ధ్వజమెత్తారు. సుజనా చౌదరి కమల వనంలో ఉన్న పచ్చ పుష్పమని అంబటి ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్‌లో వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. గతంలో మేఘా కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్టులు ఇవ్వలేదా అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

error: