ఫీజులు కట్టకుంటే పిల్లలకు క్లాస్ లు లేనట్టే…

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోజుకు చెప్పే రెండు మూడు క్లాసులకే పూర్తి ఫీజులు వసూలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక పక్క కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు ఈ ఫీజుల చెల్లింపు తలకు మించిన భారంగా మారుతోంది.

  ఇప్పటికే ఫస్ట్‌ టర్మ్‌ ఫీజులు..పుస్తకాలు, నోటు బుక్స్, ఫోన్లు, కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీగా ఖర్చు చేసిన తల్లిదండ్రులకు..సెకండ్‌ టర్మ్‌ ఫీజుల చెల్లింపు వారి కుటుంబాలను మరింత ఆర్థి్క సంక్షోభంలోకి నెట్టేస్తుంది. మొత్తం ఫీజులో 50 శాతం చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ క్లాసుకు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇస్తాం! లేదంటే క్లాసు నుంచి డిస్కనెక్ట్‌ చేస్తాం! అంటూ యాజమాన్యాలు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక ఆయా స్కూళ్ల ముందే నిరసనకు దిగుతున్నా పట్టించుకున్న నాధుడే లేరు. అంతేకాదు ఆయా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

      అనుమతించక పోయినా..ఆన్‌లైన్‌ తరగతులు తెలంగాణ వ్యాప్తంగా 10549 పాఠశాలలు ఉండగా, వీటిలో 30 లక్షల మంది వివిధ తరగతులు చదువుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మూడు వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వీటిలో పది లక్షల మంది పిల్లలు ఉన్నారు. నిజానికి జూన్‌ 12 నుంచి అన్ని స్కూళ్లు రీ ఓపెన్‌ కావాల్సి ఉండగా, కరోనా విజృంభి స్తుండటంతో ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. ప్రభుత్వం అనుమతించక పోయినప్పటికీ నగరంలోని పలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తుంది.
ఆందోళనకు దిగిన తల్లిదండ్రులపై కేసులు
కరోనా సమయంలో ఫీజులు పెంచొద్దని పేర్కొంటూ ప్రభుత్వం జీఓ నెంబర్‌ 46 జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ నగరంలోని ఏ ఒక్క పాఠశాల కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. పలు కార్పొరేట్‌ స్కూళ్లు గతేడాది కంటే ఎక్కువ గా రూ. పది వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లను నిరసిస్తూ ఇటీవల పలువురు తల్లిదండ్రులు ఆయా కార్పొరేట్‌ పాఠశాలల ముందు ఆందోళనకు దిగడం తెలిసిందే. తల్లిదండ్రులకు అండగా నిలువాల్సిన అధికారులు, పోలీసులు ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదు చేయడం విశేషం.
    ట్యూషన్‌ ఫీజుకు మించి వసూలు చేయొద్దు
హైదరాబాద్‌ జిల్లాలోని ఏడు ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు అందాయి. అధికారుల విచారణలో మూడు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా వివరించాం. ఇకపై కూడా ఏదైనా స్కూలుపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడుతాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే అట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోం. ప్రభుత్వం కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తప్పవు…

 

error: